ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల విషయంలో తెరాస మొదట అత్యుత్సాహం ప్రదర్శించినప్పటికీ, దాని వలన తాము బలపరుస్తున్న జగన్మోహన్రెడ్డికే నష్టం జరుగుతుందని పసిగట్టి హటాత్తుగా సైలెంట్ అయిపోయింది. తాము బహిరంగంగా జగన్తో చేతులు కలిపి మద్దతు తెలిపినట్లయితే, చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలలో సెంటిమెంటు రగిల్చితే వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉంటుందని తెరాస బాగానే గ్రహించింది. కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం గ్రహించకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కేసీఆర్ మద్దతు ఇస్తానంటే తీసుకొంటే తప్పేమిటి?” అని జగన్ ప్రశ్నించారు.
తద్వారా తనకు కేసీఆర్ సహకరిస్తున్నారని, ఆయనతో తమకు అవగాహన ఉందని స్వయంగా దృవీకరించినట్లయింది. జగన్-కేసీఆర్ మద్య రహస్య అవగాహన ఉందని వాదిస్తున్న టిడిపికి జగన్ నోరారా చెప్పిన ఈ ఒక్క మాటను బ్రహ్మాస్త్రంలాగ వాడేసుకొంటూ ప్రజలలో సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే రాష్ట్రం చంద్రబాబునాయుడు చేతిలోకి వెళ్లిపోతుందని తెరాస ఏవిధంగా వాదించిందో, ఇప్పుడు టిడిపి కూడా జగన్మోహన్రెడ్డికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతుందంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. జగన్ గెలిస్తే కేసీఆర్కు సామంతరాజుగా మారి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్కు తాకట్టు పెడతారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. టిడిపి వాదనతో ఏపీ ప్రజలు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఎక్కడ తగ్గాలో తెరాసకు బాగా తెలుసు కానీ జగన్కు తెలియలేదు.