కేసీఆర్‌ కాంగ్రెస్‌కు బ్రహ్మాస్త్రం అందించారు కానీ...

March 30, 2019


img

మిర్యాలగూడలో నిన్న జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్‌, “గతంలో యూపీయే హయంలో 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని” చెప్పి సంచలనం సృష్టించారు. ప్రధాని నరేంద్రమోడీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి గొప్పగా చెప్పుకొంటూ ఎన్నికలలో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మోడీని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. 

గత 5 ఏళ్ళుగా సిఎం కేసీఆర్‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇంకా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ తో విలవిలలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయనే తెలిసో తెలియకో ఒక బ్రహ్మాస్త్రం వంటి ఆయుధం అందజేశారు.

దేశభద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం రాజీపడలేదని స్వయంగా కేసీఆరే దృవీకరించారని చెప్పుకోవచ్చు. అయితే ఆ అంశాన్ని బిజెపి నేతల మాదిరిగా రాజకీయ లబ్దికోసం వినియోగించుకోవడంలేదని ప్రచారం చేసుకొనే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి సిఎం కేసీఆర్‌ స్వయంగా కల్పించారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ చెప్పిన ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకొంటారో లేదో చూడాలి.


Related Post