కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేస్తున్నప్పుడు కూడా వారిని ‘జీ’ (గారు) అంటూ సంభోదిస్తుంటారు. ఆ అలవాటులో పొరపాటుగా కరడుగట్టిన పాక్ ఉగ్రవాది మసూద్ అజహర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతనినీ ‘జీ’ అంటూ సంభోదించారు. ఉగ్రవాదం గురించి రాహుల్ గాంధీ చెప్పింది అంతా విడిచిపెట్టి, మసూద్ ను రాహుల్ గాంధీ ‘జీ’ అంటూ గౌరవంగా సంభోదించడాన్ని తప్పు పడుతూ బిజెపి నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. వారికి రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి ఘాటుగా జవాబిచ్చారు.
“దేశభక్తి, ఉగ్రవాదం గురించి బిజెపి నేతల చేత పాఠాలు చెప్పించుకొనే దుస్థితిలో మేము లేము. రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరు ఉగ్రవాదానికి బలైయ్యారు కనుక ఆ బాధ ఏవిధంగా ఉంటుందో బిజెపి నేతల కంటే రాహుల్ గాంధీకే బాగా తెలుసు. అయినప్పటికీ తన తండ్రిని పొట్టనపెట్టుకొన్న వారిని క్షమించిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన పొరపాటున పాక్ ఉగ్రవాదిని ‘జీ’ అని సంభోదించినంత మాత్రన్న ఆయనకు ఉగ్రవాదులకు ముడిపెట్టేయడమేనా? మరి కాందహార్ ఘటనలో అదే ఉగ్రవాదిని బిజెపి స్వయంగా తీసుకువెళ్లి ఉగ్రవాదులకు అప్పజెప్పింది కదా? మరి బిజెపిని ఏమనాలి?” అని విజయశాంతి ప్రశ్నించారు.