పాపం రవళి!

March 04, 2019


img

ప్రేమోన్మాది దాడికి గురైన తోపుచర్ల రవళి (20) సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించింది. హన్మకొండకు చెందిన రవళి స్థానిక వాగ్ధేవీ డిగ్రీ కాలేజీలో బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న అన్వేష్ అనే విద్యార్ధి గత కొంతకాలంగా ప్రేమపేరుతో ఆమెను వేధిస్తున్నాడు. కానీ ఆమె అతనిని తిరస్కరిస్తుండటంతో గత నెల 27 ఉదయం ఆమె కాలేజీకి వెళుతుండగా బైక్ పై వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆ దాడిలో ఆమెకు 90 శాతంపైగా గాయాలయ్యాయి. ఆమెను సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ సోమవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. 

ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే, ప్రేమోన్మాదుల చేతిలో రవళి, మధులికవంటి యువతులు దాడులకు గురవుతున్నారు. వారు చేసిన పాపం ఆడపిల్లగా పుట్టడం కాస్త కంటికి ఇంపుగా కనబడటం. వయసులో ఉన్న అమ్మాయిలు బయటకు వెళితే మళ్ళీ తిరిగివచ్చేవరకు భయపడే రోజులు దాపురించాయి. ఆడపిల్లలను వేధించే మగరాయుళ్ళను శిక్షించేందుకు ప్రభుత్వం మరింత కటినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎన్ని కటినమైన చట్టాలు రూపొందించినప్పటికీ నేటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కనుక పోలీస్ శాఖ కూడా వేధింపుల కేసులను తేలికగా తీసుకొని విడిచిపెట్టేయకుండా, వేధింపులకు గురవుతున్న విద్యార్ధినులు, మహిళలకు రక్షణ, భరోసా కల్పించేవిధంగా అవసరమైన చర్యలు చేపట్టాలి. అప్పుడే ఇటువంటి దురదృష్టకర ఘటనలను నివారించవచ్చు.


Related Post