రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచారరధసారధి విజయశాంతి తెరాసపై పోరాటానికి సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్)లను తెరాసలో చేర్చుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పార్టీ మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేకుంటే స్పీకరు వారిపై అనర్హత వేటు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగబద్దంగా నడుచుకొని చట్ట ప్రకారం వారిరువురిపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నామని విజయశాంతి అన్నారు. ఒకవేళ ఆవిధంగా జరుగకపోతే ఈ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తెరాసను ఎండగడతామని హెచ్చరించారు. ఎల్లుండి అంటే బుదవారం పినపాకలో, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. మళ్ళీ శుక్రవారం ఆ రెండు నియోజకవర్గాలలో సీఎల్పీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.