పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వాయుసేన చేసిన భీకరదాడులతో వాయుసేనకు అందరూ జేజేలు పలుకుతుండగా, మరోపక్క వరుసగా నేలకూలుతున్న మిగ్ విమానాలు వాయుసేన పరువుతీస్తున్నాయి.
కశ్మీర్లో బుడగావ్ లో ఈరోజు ఉదయం ఒక మిగ్ విమానం కుప్పకూలిపోయింది. రోజువారీ గస్తీలో భాగంగా మిగ్ విమానం ఈరోజు ఉదయం శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే శ్రీనగర్కు సుమారు 7 కిమీ దూరంలో బుడగావ్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. విమానం నేలకూలగానే మంటలలో కాలి బూడిదైపోయింది. విషయం తెలుసుకొన్న వాయుసేన అధికారులు అక్కడకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదానికి సాంకేతికలోపం కారణమా లేక మానవ తప్పిదమా లేక పాక్ సైనికులో లేక ఉగ్రవాదులో విమానాన్ని పేల్చి వేశారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ ఈ ఘటనలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తేలితే భారత్ మరింత తీవ్రంగా స్పందించడం ఖాయం.
ఒకవేళ సాంకేతికలోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లయితే, ‘మిగ్ విమానాలు ఎగిరే శవపేటికలనే’ పేరు సార్ధకం అవుతుంది. కాలం చెల్లిన అటువంటి డొక్కు విమానాలను పక్కన పెట్టకుండా వినియోగిస్తుండటం వలన వాయుసేనలో సుశిక్షితులైన పైలట్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వాయుసేన యుద్ద సన్నదతపై కూడా అనుమానాలు కలుగుతాయి.