భారత్ వాయుసేన దాడుల తదనంతర పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాడులు జరిపిన వెంటనే ఆ విషయం భారత్ అధికారికంగా దృవీకరించడమే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలకు ఐక్యరాజ్యసమితికి ఆ దాడుల గురించి పూర్తి సమాచారం అందజేసింది. అదేసమయంలో పాకిస్థాన్ దాడులు జరిగాయని కానీ జరుగలేదని గానీ చెప్పలేని దుస్థితిలో ఉంది.
సాధారణంగా ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు ప్రపంచదేశాలు సానుకూలంగానో, ప్రతికూలంగానో స్పందిస్తుంటాయి. కానీ భారత్ దాడులను ఒక్క పాకిస్థాన్ తప్ప మరే దేశమూ ఖండించలేదు. ఈ దాడులకు ముందు రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు, అధికారం రెండూ ఉన్నాయని” చెప్పడం చూస్తే ఈవిషయంలో భారత్ నిర్ణయాన్ని అమెరికా సమర్ధించినట్లే భావించవచ్చు.
ఇక దాడుల తరువాత పాక్ పార్లమెంటులో ప్రతిపక్షాలు (పాక్ ప్రధాని) ‘ఇమ్రాన్ ఖాన్..షేమ్...షేమ్ అని అరుస్తూ ఎద్దేవా చేయగా, ఈరోజు సాయంత్రం డిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీని అభినందించి, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా అండగా నిలబడతామని చెప్పారు.
ఇప్పుడు ఏమి చేయాలో, ఈ అవమానకర పరిస్థితుల నుంచి ఏవిధంగా బయటపడాలో తెలియక పాక్ పాలకులు, సైన్యాధికారులు తలలు పట్టుకొని కూర్చోంటే, భారత్ శక్తిసామర్ధ్యాలను ప్రపంచదేశాలకు మరొక్కసారి చాటి చెప్పి గర్వంగా నిలిచింది భారత్.
భారత్కు బుద్ది చెపుతామని హెచ్చరిస్తూ పాక్ పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, పాకిస్థాన్పై మెరుపువేగంతో ఇంత ధీటుగా ప్రతీకారం తీర్చుకొన్నందుకు భారత్ ఆర్మీ, నేవీ, వాయుసేన త్రివిధదళాలు చాలా ఆనందంతో పొంగిపోతున్నాయి. మరింత ఆత్మవిశ్వాసంతో పాక్తో యుద్ధానికి సై అంటున్నాయి.
తమ పాలకులను, వారి తీరును చూసి పాక్ ప్రజలు చీత్కరించుకొంటుంటే, మోడీ ప్రభుత్వానికి యావత్ దేశప్రజలు జేజేలు పలుకుతున్నారు.