తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా పద్మారావుగౌడ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు సహకరించవలసిందిగా కోరేందుకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను ఆ తరువాత టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. కేటీఆర్ ప్రతిపాదనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు కానీ ఒక షరతు విధించారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగబోతున్న ఎమ్మెల్సీల ఎన్నికలో తమ అభ్యర్ధి గెలుపుకు తెరాస సహకరించాలని కోరారు. దానిపై సిఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని కేటీఆర్ చెప్పారు. కానీ ఖాళీ కాబోతున్న 5 స్థానాలలో 4 స్థానాలకు సిఎం కేసీఆర్ శుక్రవారమే అభ్యర్ధులను ఖరారు చేశారు. 5వ స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీకి విడిచిపెట్టారు. కనుక ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీకి తెరాస నుంచి ఎటువంటి సహకారమూ లభించదని స్పష్టం అయ్యింది. కనుక ఉపసభాపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించకపోవచ్చు.