మార్చి 6వ తేదీన నిజామాబాద్లో జరుగబోయే బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకాబోతున్నారు. త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల ఎంపిక, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం ఆయన వస్తున్నట్లు సమాచారం. మార్చి 2వ తేదీ నుంచి 119 శాసనసభ నియోజకవర్గాలలో బిజెపి శ్రేణులతో బైక్ ర్యాలీలు నిర్వహించి ఎన్నికల ప్రచారం మొదలుపెడతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ మీడియాకు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 119 స్థానాలకు పోటీ చేసి కేవలం ఒకే ఒక స్థానం (ఘోషామహల్) గెలుచుకోగలిగింది. ఆవిధంగానే జరుగబోతోందని సిఎం కేసీఆర్ ముందే జోస్యం చేపపారు. అదే నిజమైంది. ఈసారి 17 లోక్సభ స్థానాలలో తెరాస 16స్థానాలు, మజ్లీస్ ఒకటి గెలుచుకొంటాయని సిఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. అదే జరిగితే రాష్ట్రంలో తెరాస మరింత బలపడుతుంది...బిజెపి క్రమంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకొంటున్నారు. కనుక వారి నుంచి బిజెపికి గట్టిపోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపధ్యంలో లోక్సభ ఎన్నికలు రాష్ట్ర బిజెపికి ఒక అవకాశంగా కాక అగ్నిపరీక్షగా మారవచ్చు. అమిత్ షా రాష్ట్ర బిజెపిని గట్టెక్కించగలరో లేదో చూడాలి.