నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తన నివాసంలో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలలో నేను నల్గొండ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. కనుక మీరందరూ భాద్యత తీసుకొని నన్ను గెలిపించేందుకు సహకరించవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకున్నట్లు చెప్పారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆయన వంటి సీనియర్ నేతలు శాసనసభకు పోటీ చేయడం చాలా అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. కానీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆ షాక్ నుంచి తెరుకున్నాక తాను లోక్సభకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఈనెల 20వ తేదీలోగా తెలంగాణలో లోక్సభ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసి పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించింది. ఆ జాబితాలో ఆయన పేరు ఉండబోతోందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాజా ప్రకటన స్పష్టం చేస్తోందని భావించవచ్చు.