సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మరో నాలుగేళ్ళు వరకు సిఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయనని ప్రకటించేరు కనుక ఇకపై ఆయన మౌనం వహిస్తారని అందరూ భావించారు. అయితే ఆయన తెరాసకు బదులు సొంతపార్టీ మీదే విమర్శలు గుప్పిస్తుండటం గమనిస్తే తెరాసకు దగ్గరవుతున్నారనే అభిప్రాయం కలగడం సహజం.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో లాబీయింగ్ చేసేవారికే ప్రాధాన్యత లభిస్తుంది. వారికే పార్టీలో పదవులు, పెత్తనం లభిస్తుంటాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఈసారి లోక్సభ ఎన్నికలలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీసం 7-8 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకోగలదని నేను భావిస్తున్నాను. నేను జైలులో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు తప్ప కాంగ్రెస్ నేతలు ఎవరూ నన్ను పరామర్శించడానికి రాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. సిఎం కేసీఆర్తో నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. నా నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైనప్పుడు వెళ్ళి తప్పకుండా కలుస్తాను,” అని అన్నారు.