తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పధకాలు, అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండటం మానందరికీ గర్వకారణం. తెలంగాణ రైతంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న రైతుబంధు పధకాన్ని కేంద్రప్రభుత్వం కూడా స్వీకరించింది. తాత్కాలిక ఆర్ధికమంత్రి పీయూష్ గోయల్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రైతు బంధు పధకాన్ని పోలిన ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్’ పధకాన్ని ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ.3,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.6,000 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.10,000 చొప్పున చెల్లించబోతోంది.
కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రకటించిన పధకంలో 5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ పొలం ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 చెల్లిస్తుంది. దీనిని మూడు విడతలలో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తుంది. అంటే కేంద్రప్రభుత్వం ఇవ్వబోతున్న దానికంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ ఇస్తోందన్నమాట. అదికూడా ఎకరానికి రూ.10,000 చొప్పున 5 ఎకరాలకు 50,000 కేవలం రెండు వాయిదాలలోనే చెల్లించబోతోంది.
రైతుబంధు పధకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శించారు. దానివలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని వాదించారు. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వం కూడా ఆ పధకాన్ని అమలుచేయడానికి సిద్దపడుతోంది కనుక ఇకపై బిజెపి నేతలు రైతుబంధు పధకంపై విమర్శలు మానుకొక తప్పదు. కేంద్రప్రభుత్వం బడ్జెట్లో ఈ పధకం ప్రవేశపెట్టి గ్రామీణ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది కనుక కాంగ్రెస్ పార్టీ కూడా తపప్నిసరిగా రైతుబంధు పధకాన్ని పోలిన హామీనీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే అవకాశాలుంటాయి కనుక కాంగ్రెస్ నేతలు కూడా ఇకపై రైతు బంధు పధకంపై విమర్శలు చేయడం మానుకోకతప్పదు.