ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్పుడే రాజకీయ నాయకుల పార్టీల ఫిరాయింపులు మొదలయ్యాయి. కడప జిల్లా రాజాంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడు వంగవీటి రాధ టిడిపిలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. వారిరువురు చాలా పలుకుబడి, ప్రజాధారణ ఉన్న ప్రముఖ నాయకులే కావడంతో ఆ రెండు పార్టీలు ఒకరిని పొంది మరొకరిని కోల్పోయినందుకు సంతోషించాలో లేక బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నాయి.
ఇక ఏపీలో కూడా బిజెపి పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఆ పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇటీవలే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ నెలాఖరులోగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తానని చెప్పారు కనుక త్వరలోనే బిజెపి నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు జనసేనలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.