అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులుకావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటుచేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని సీనియర్ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, “రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (ఏ) ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతంకు మించి 2 శాతం కంటే తక్కువ మంత్రివర్గంలో మంత్రులు ఉండకూడదు. కానీ రాష్ట్రంలో కేవలం ఇద్దరే మంత్రులతో ప్రభుత్వం నడుస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్దమని తెలిసి ఉన్నప్పటికీ గవర్నర్ నరసింహన్ పట్టించుకోవడంలేదు. తెరాస అధికారంలోకి వచ్చి 45 రోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఎందుకు ఏర్పాటు చేయలేదని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించడంలేదు. రాష్ట్రానికి ఆర్ధికమంత్రి లేకుండా ప్రభుత్వం ఏవిధంగా నడిపిస్తున్నారు? అసలు ఇంతవరకు ఎందుకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు?” అని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తెరాస నేతలు ఏమి సమాధానం చెపుతారో చూడాలి. ఒకవేళ మంత్రివర్గం ఏర్పాటుకు సిఎం కేసీఆర్ ఇంకా ఆలస్యం చేస్తే దీనిపై కూడా కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషను వేసినా ఆశ్చర్యం లేదు.