ఈరోజు ఎన్టీఆర్ 23వ జయంతి సందర్భంగా టిడిపి నుంచి బహిష్కరించబడిన మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలనే కాస్త మార్పులు చేర్పులు చేసి నేటికీ ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. సమాజంలో బడుగుబలహీనవర్గాలకు ఒక గుర్తింపు, అధికారంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప వ్యక్తి. ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించిన మొట్ట మొదటి నాయకుడు ఆయనే. సినీ, రాజకీయ రంగాలలో ఆయన చెరగని ముద్రవేసి తెలుగు ప్రజల గుండెలలో ఎప్పటికీ నిలిచిపోయారు,” అని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ, “సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజున నేను తెలంగాణలో టిడిపి దయనీయ పరిస్థితిలో ఉందని దానిని కాపాడుకోవడానికి తెరాసతో చేతులు కలపాలని సూచిస్తే, చంద్రబాబునాయుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నందుకు రాష్ట్రంలో టిడిపి కనబడకుండా పోయింది. నేను పార్టీని కాపాడుకోవాలని ఆలోచిస్తే, చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పార్టీని కనబడకుండా చేశారు. దీనికి ఆయన బాధ్యత వహిస్తారా?” అని ప్రశ్నించారు.