ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య త్వరలో తెరాసలో చేరబోతున్నారంటూ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించినప్పటికీ ఆగడం లేదు. పైగా ఆయనకు మంత్రిపదవి ఆశిస్తున్నారని, సిఎం కేసీఆర్ అందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 13 సీట్లకు పోటీ చేసిన టీడీపి ఖమ్మం జిల్లాలో మాత్రమే రెండు సీట్లు గెలుచుకోగలిగింది. వాటిలో ఒకటి సండ్ర వెంకటవీరయ్య, మరొకటి ఎం నాగేశ్వరరావు గెలుచుకున్నారు. కనుక ఇక రాష్ట్రంలో టిడిపి తన పట్టుకోల్పోయిందని స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో ఇంకా టిడిపిని అంటిపెట్టుకొని ఉండటం కంటే అధికార తెరాస నుంచి ఆహ్వానం లభిస్తున్నప్పుడు దానిలోకి జంప్ చేసేయడమే బెటర్ అని ఎవరైనా ఆశపడవచ్చు. కనుక సండ్ర వెంకటవీరయ్య కూడా అలాగే ఆశపడుతున్నట్లున్నారు. తెరాసకు ఖమ్మంపై పూర్తి పట్టుసాధించడానికి ఆ ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకోవడానికి వెనుకాడకపోవచ్చు. కనుక సండ్రకు మంత్రిపదవి లభించినా లభించకపోయినా ఆయన తెరాసలో చేరడం మాత్రం ఖాయం అని భావించవచ్చు.