రాష్ట్ర రాజకీయాలలో హుందాగా మాట్లాడేవారిలో సీనియర్ కాంగ్రెస్ నేత కె జానారెడ్డి ప్రధమస్థానంలో నిలుస్తారని అందరికీ తెలుసు. నాగార్జున్ సాగర్ నుంచి పోటీ చేస్తున్న ఆయనకు తెరాసకు చెందిన నోముల నర్సింహయ్య ప్రధాన ప్రత్యర్ధి కనుక వారిరువురూ రాజకీయంగా శత్రువులే. కానీ పోలింగ్ జరుగుతున్న సమయంలో వారిరువురూ ఒకరికొకరు ఎదురుపడితే ఏమవుతుంది? అంటే వారి వెంట ఉండే అనుచరులు ఘర్షణ పడతారని ఎవరైనా చెపుతారు. కానీ అందుకు భిన్నంగా వారిరువురూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. అది చూసి అక్కడి ప్రజలే కాదు...కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు.
జానారెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తునప్పుడు నోముల నర్సింహయ్య తన కారులో నుంచి దిగుతూ కనబడ్డారు. అప్పుడు జానారెడ్డి ఆయన కారుదిగేవరకు నిలబడి, దిగిన తరువాత ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకొన్నారు. ఆ తరువాత వారిరువురూ కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడుకొని ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. రాజకీయాలలో హుందాతనం పాటిస్తే అవతలి వ్యక్తి కూడా గౌరవిస్తాడని చెప్పడానికి ఇదే ఒక చక్కటి ఉదాహరణ. కానీ మన రాజకీయ నాయకులలో ఎంతమందికి ఈ హుందాతనం ఉంది?