అక్కకు హ్యాండ్ ఇచ్చినా ఓటు వేశాడు

December 07, 2018


img

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఈరోజు ఉదయం తమఓటు హక్కును వినియోగించుకొన్నారు. కూకట్‌పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన వారి సోదరి సుహాసిని మోహిదీపట్నంలో తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. 

ఆమె టిడిపి అభ్యర్ధిగా బరిలోకి దిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు ఇద్దరూ ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని అందరూ భావించారు. ఆమె, ఆమె తరపున ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ కూడా వారిరువురికీ ఖాళీ ఉంటే తప్పకుండా వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు. కానీ వారు రాలేదు. 

దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నెగెటివ్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ బరువు పెరిగారని కనుక అక్క సుహాసిని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే ఆ సినిమాకు సంబందించి క్లూ బయటపెట్టినట్లవుతుంది కనుకనే ఆయన రాలేదని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు సర్ది చెప్పుకొన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఇవాళ్ళ ఓటు వేయడానికి రావడంతో వారు వేరే కారణం చేత అక్క తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి రాలేదని స్పష్టం అయ్యింది. అక్క తరపున ఎన్నికల ప్రచారం చేయలేకపోయినప్పటికీ ఆమె గెలవాలని కోరుకొంటున్నామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. 


Related Post