ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస-మహాకూటమి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఎన్నికలలో రాజకీయపార్టీలు ప్రజలను ఆకట్టుకొనేందుకు అనేకానేక ఆకర్షణీయమైన హామీలు గుప్పించడం సహజమే. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి నిరుద్యోగభృతి, పెన్షన్ సొమ్ము రెట్టింపు, ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాల మాఫీ వంటి కొన్ని ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది. కనుక తెరాస కూడా దానితో పోటీ పడుతూ ఆ హామీలను తాము కూడా అమలుచేస్తామని ప్రకటించవలసి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నేటికీ రోజుకో కొత్త హామీలను ప్రకటిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులుగా ఎంపిక అయినవారికి ఏడాదికి రూ.50,000 ఇంటి అద్దెగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అలాగే గతంలో ఇందిరమ్మ ఇళ్ళు పొందినవారందరూ ఆ ఇళ్ళలో అధనపు గాడి లేదా మరమత్తులు చేసుకోవడానికి గాను ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. కనుక ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి తెరాస హామీ ఇవ్వవలసి రావచ్చు.
తెరాస, మహాకూటమిలో ఏది ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ ఏది అధికారంలోకి వచ్చినా ఈ హామీలను అమలుచేయక తప్పదు. కనుక ఈ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడినా తమకు ఇంత మహోపకారం చేసినందుకు తెలంగాణ ప్రజలు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.