తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ స్పైసీగానే ఉంటాయి. అవి సాధారణ స్థితిలో కొనసాగితేనే చాలా విచిత్రం. (దివంగత ముఖ్యమంత్రి) జయలలిత ఆసుపత్రి పాలైనప్పటి నుంచి తమిళ రాజకీయాలు మరింత ఘాటెక్కాయి. నేటికీ అవి అదేవిధంగా సాగుతుండటం విశేషం.
ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి పన్నీర్ సెల్వమ్ వర్గానికి, దినకరన్(అవినీతి ఆరోపణల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు మేనల్లుడు) వర్గానికి మద్య జరుగుతున్న అప్పటి నుంచి రాజకీయ చదరంగం సాగుతోంది. దానిలో భాగంగా పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు 18 మంది ఎమ్మెల్యేలను దినకరన్ తనవైపు తిప్పుకొన్నాడు. వారిని వెనక్కు రప్పించేందుకు పళనిస్వామి వర్గం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, స్పీకర్ చేత వారిపై అనర్హత వేటు వేయించారు.
దానిపై వారు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళగా ఆ కేసుపై ఇరుపక్షల వాదనలు విన్న తరువాత హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖరారయింది. ఒకవేళ హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉండి ఉంటే పళనిస్వామి ప్రభుత్వానికి మెజార్టీ లేనికారణంగా కూలిపోయుండేది. కానీ అదృష్టవశాత్తు గండం గట్టెక్కింది.
ఇప్పుడు ఆ 18 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్ళదలచుకోకపోతే, ఆ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరుపవలసి ఉంటుంది. అదే కనుక జరిగితే తమిళ రాజకీయాలు మళ్ళీ సాంబారులాగా కూతుకుత ఉడకటం ఖాయం.