గురువారం సాయంత్రం నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. “ఇవాళ్ళ ఒక తాజా సర్వే రిపోర్ట్ నా చేతికి వచ్చింది. దాని ప్రకారం ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్కు 110 స్థానాలు, మజ్లీస్ పార్టీ-7 స్థానాలు, మిగిలిన రెండూ ప్రతిపక్షాలు గెలుచుకొంటాయని తేలింది. నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురబోతోందని సర్వేలో తేలింది. అంటే ఈసారి ఎన్నికలలో ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరి గోచీలు ఊడగొట్టబోతున్నారన్న మాట,” అని అన్నప్పుడు సభకు వచ్చిన ప్రజలు ఈలలు, కేకలతో తమ హర్షాతిరేకాన్ని తెలియజేశారు.
సిఎం కెసిఆర్ సర్వేలు పేరు చెప్పి టిఆర్ఎస్కు ఒక సానుకూల వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. గతంలో కొన్ని పార్టీలు ఈ వ్యూహాన్ని అమలుచేసి మంచి ఫలితాలు రాబట్టాయి. ఒకవేళ సిఎం కెసిఆర్ చెప్పుతున్నట్లు ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకొన్నా తెలంగాణా ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి నమ్మకం కలిగి ఉన్నట్లు, ఆయన పాలనకు పూర్తి ఆమోదం తెలిపినట్లు స్పష్టం అవుతుంది. కానీ ప్రతిపక్షాలలో హేమాహేమీలనదగ్గ అనేకమంది నాయకులు ఎన్నికల బరిలో నిలిచి ఉన్నప్పుడు టిఆర్ఎస్ 110 స్థానాలు గెలుచుకోవడం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ సిఎం కెసిఆర్ చెపుతున్నట్లు టిఆర్ఎస్ కనీసం 100 స్థానాలు గెలుచుకోగలిగినా ఇక రాష్ట్రంలో టిఆర్ఎస్కు తప్ప మరేపార్టీకి స్థానం లేదని భావించవచ్చు.