రాష్ట్రంలో ఎన్నికల గంట మ్రోగేవరకు తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తమ పార్టీ ఏ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోదని, మొత్తం 119 స్థానాలకు పోటీ చేస్తుందని చెపుతూ వచ్చారు. కానీ ఎన్నికల గంట మ్రోగిన తరువాత తమ పార్టీకి 25 స్థానాలలో బలం ఉందని, ఎన్నికల నాటికి మరో 25 స్థానాలలో బలం పుంజుకోగలమని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమయ్యారు. పొత్తులలో భాగంగా కేవలం 3 సీట్లనే ఆశిస్తున్నారు. వాటిలో ఒక స్థానం నుంచి కోదండరామ్ పోటీ చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని 3 సీట్లు అడగటం గమనిస్తే తెలంగాణా జనసమితి బలం ఆ మూడు స్థానాలకే పరిమితం అని అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీని స్థాపించడం, దానిని సమర్ధంగా నడిపించడం ఒక ఎత్తైతే, ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసి గెలవగల అభ్యర్ధులను సమకూర్చుకోవడం మరో ఎత్తు. అక్కడే పార్టీ ఎంత శక్తివంతమైనదో అర్ధం అవుతుంది. కనుక మొదటి ప్రయత్నంలో మూడు సీట్లు గెలుచుకొంటేచాలని కోదండరామ్ భావిస్తున్నారనుకోవాలేమో.