రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కాంగ్రెస్-టిడిపి పొత్తుల గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు లేరని కనుక ఆ పార్టీకి అన్ని స్థానాలలో పోటీ చేసే శక్తి లేదని అందుకే అది టిడిపితో పొత్తులకు సిద్దం అయ్యిందని అన్నారు.
అయితే ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ టిఆర్ఎస్ను ఓడించడం అసాధ్యమని, రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుచుకొని ఘనవిజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో టిడిపి, సిపిఐ, కొత్తగా ఏర్పడిన తెలంగాణా జనసమితి పార్టీలకు అటువంటి పరిస్థితి ఉందంటే నమ్మవచ్చు కానీ ఒక టికెట్ కోసం కనీసం అరడజను మంది నేతలు పోటీపడుతున్న కాంగ్రెస్ పార్టీకి 119 స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేరని నాయిని నర్సింహారెడ్డి వాదన ఆర్ధరహితంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువైన టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. రాష్ట్రంలో టిడిపికున్న బలమైన క్యాడర్ సహాయసహకారాలను పొందడానికి. 2. అలాగే టిడిపి ఓటు బ్యాంకుగా భావిస్తున్న ఆంధ్రా ఓటర్లను ఆకట్టుకోవాలని. 3. రాష్ట్రంలో టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు. ఈ సంగతి నాయినితో సహా టిఆర్ఎస్ నేతలందరికీ కూడా తెలుసు. కానీ తెలియంట్లు ఎవరికి తోచిన కారణాలు వారు చెపుతుంటారు. అంతే!