టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదలై వారం రోజులైనప్పటికీ ఇంతవరకు ప్రతిపక్షాల జాబితాలు విడుదల చేయకపోవడంతో ఆ 105 నియోజకవర్గాలలో టిఆర్ఎస్ అభ్యర్ధులతో ఎవరు పోటీ పడబోతున్నారో ఇంకా తెలియలేదు. అయితే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న సిఎం కెసిఆర్పై ప్రజా గాయకుడు గద్దర్, సిరిసిల్లా నుంచి పోటీ చేస్తున్న మంత్రి కేటీఆర్పై ప్రజా గాయని విమలక్క స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్నారని టి-మాస్ ఛైర్మన్ కంచ ఐలయ్య ప్రకటించారు. వారికి మద్దతుగా బిఎల్ఎఫ్ కూటమి ఆ రెండు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్ధులను నిలబెట్టదని ఐలయ్య చెప్పారు. అలాగే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూడా ఆ రెండు నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను నిలపకుండా గద్దర్, విమలక్కల విజయానికి సహకరించాలని కోరారు.
సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్లకున్న ప్రజాధారణ గురించి అందరికీ తెలుసు. కుదిరితే ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ను ఓడించగలవేమో కానీ వారిరువురినీ ఓడించడం ఆసంభవమేనని చెప్పవచ్చు. ఈ విషయం కాంగ్రెస్, బిజెపి, టిడిపి తదితరపార్టీలకు కూడా బాగా తెలుసు. కనుక అక్కడ తమ అభ్యర్ధులను నిలబెట్టకుండా గద్దర్, విమలక్కలకు మద్దతు ప్రకటించడం ద్వారా కెసిఆర్, కేటీఆర్ చేతిలో ఓటమిని తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు. అయితే గద్దర్, విమలక్కలు మాత్రం చివరికి ఈ రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మిగిలిపోవడం ఖాయం.