సిఎం కెసిఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చూసి భయపడిపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక అర్ధరహితమైన వాదన చేస్తుండటం అందరూ గమనించే ఉంటారు. ‘రాహుల్ గాంధీని చూసి నేనెందుకు భయపడాలి?’ అని సిఎం కెసిఆర్ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు ఎవరూ సమాధానం చెప్పరు కానీ పదేపదే వారు అదే పాట పడుతుంటారు. వారు ఆవిధంగా ఎందుకు వాదిస్తున్నారు? అంటే దానికి బలమైన కారణమే కనిపిస్తోంది.
నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పలేక రాహుల్ గాంధీని చూసి సిఎం కెసిఆర్ భయపడుతున్నారని వాదిస్తున్నారని చెప్పవచ్చు. కానీ వారు చెప్పదలచుకొన్నదేమిటంటే, తమను చూసే కెసిఆర్ భయపడుతున్నారని చెప్పాలనుకొంటున్నారు.
తమ పార్టీ నేతలను టిఆర్ఎస్లోకి ఫిరాయింపజేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని సిఎం కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేటికీ గట్టిగా నిలబడి ఉండటమే కాకుండా ఈ నాలుగేళ్లలో టిఆర్ఎస్ను ముప్పతిప్పలు పెట్టి, సార్వత్రిక ఎన్నికలంటే కెసిఆర్ భయపడేలా చేసిందని వారు చెప్పదలచుకొన్నారు. కానీ ఆవిధంగా చెపితే కాంగ్రెస్ పార్టీలో ‘ఆ క్రెడిట్’ కోసం కొట్లాటలు మొదలైపోతాయి.
సిఎం కెసిఆర్ను మేమే బలంగా డ్డీ కొన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డికె అరుణ తదితరుల అభిప్రాయపడితే ఆశ్చర్యం లేదు. అది తమ సమిష్టి శక్తి అని వారనుకొంటే తమను చూసే కెసిఆర్ భయపడుతునారని ధైర్యంగా చెప్పుకొనేవారు. కానీ అందుకు ఎవరూ అంగీకరించరు కనుకనే రాహుల్ గాంధీని చూసి సిఎం కెసిఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవలసి వస్తోంది.
వారి ఈ బలహీనత సిఎం కెసిఆర్ కూడా బాగానే అర్ధం చేసుకొన్నారు. కానీ ఆ విషయం బయటపెట్టడం వలన వ్యక్తిగతంగా తన ఇమేజ్, పార్టీకి నష్టం జరుగుతుంది. కనుకనే ఆయన కూడా రాహుల్ గాంధీతోనే ఆటాడుకొంటున్నట్లు చెప్పవచ్చు.