సిఎం కెసిఆర్ గురువారం ప్రకటించిన టిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా చేసిన పట్నం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. అది కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నియోజకవర్గమని అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డికి గట్టి పట్టున ఆ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న పట్నం నరేందర్ రెడ్డి గెలుపుకోసం చాలా శ్రమించవలసి ఉంటుంది. అయితే నెలరోజుల క్రితమే మంత్రి కేటీఆర్ తదితరులు కొడంగల్ నియోజకవర్గంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే టిఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. కనుక రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డిని ఓడించి నియోజకవర్గంపై తమకున్న పట్టును మరోసారి నిరూపించుకొనేందుకు చాలా గట్టిగా ప్రయత్నించడం ఖాయం.
రేవంత్ రెడ్డిని ఎదుర్కొని ఓడించేందుకు పట్నం నరేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ తదితరుల సహాయసహకారాలు చాలా అవసరమేనని చెప్పవచ్చు. విశేషమేమిటంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరూ టిడిపిలోనే కలిసి పనిచేశారు. పట్నం నరేందర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడుతుండటంతో రాజకీయంగా శత్రువులుగా మారారు.