శాసనసభ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర పడింది. తరువాత ఏమి జరుగుతుందంటే శాసనసభను రద్దు చేస్తూ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ శాసనసభ కార్యదర్శికి పంపిస్తారు. ఆయన దానిపై అవసరమైన నివేదిక తయారు చేసి దానిని స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రి ఆమోదంతో ముఖ్యమంత్రికి పంపిస్తారు. దానిని ఆయన ఆమోదించిన తరువాత మళ్ళీ గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపిస్తారు. దానిని గవర్నర్ ఆమోదించిన తరువాత శాసనసభను రద్దు చేస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఆ విషయం తెలియజేసి రాష్ట్రంలో శాసనసభకు మళ్ళీ ఎన్నికలు జరిపించవలసిందిగా కోరుతారు. రాజ్యాంగం ప్రకారం జరుగవలసిన ఈ ప్రక్రియ అంతా ఒకటి రెండు రోజులలోపుగానే పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కనుక ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మిగిలిన కధ అందరికీ తెలిసిందే.