సిఎం కెసిఆర్ హడావుడి చూసి ఈరోజు కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు ఎన్నికలకు చేసుకోవలసిన ఏర్పాట్ల గురించి చర్చించుకొన్నారు. రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ కూడా ఈరోజు రాత్రి 8 గంటలకు అత్యవసరం సమావేశమయ్యింది. వారు కూడా ముందస్తు ఎన్నికల సన్నహాల గురించే చర్చించుకొంటారని వేరే చెప్పనవసరం లేదు.
ముందస్తు ఎన్నికల గురించి సిఎం కెసిఆర్ నేరుగా ప్రధాని మోడీతోనే తరచూ చర్చిస్తున్నప్పటికీ, కెసిఆర్ ముందస్తు ఆలోచనలు, వ్యూహాల గురించి రాష్ట్ర బిజెపి నేతలకు ఎటువంటి ‘ముందస్తు సమాచారం’ లభించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వాదిస్తూ ఇంతకాలం కాలక్షేపం చేయడం విడ్డూరంగా ఉంది. నిజానికి కేంద్రంలో స్వంత పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీలో కూడా ఆ శక్తి సామర్ధ్యాలు ప్రతిభింబించాలి కానీ రాష్ట్ర బిజెపి పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా కనిపిస్తోంది. కెసిఆర్-మోడీ దోస్తీ కారణంగా టిఆర్ఎస్ పట్ల తమ అధిష్టానం వైఖరి ఏమిటో తెలియక రాష్ట్ర బిజెపి నేతలు తికమకపడుతూ అయోమయస్థితిలో ఉండిపోయారేమో? ఇంకా వారు ఇదే అయోమయస్థితిలో ముందుకు సాగినట్లయితే రాబోయే ఎన్నికలలో బిజెపికి ఘోరపరాభవం తప్పదు. కనుక ఇకనైనా బిజెపి అధిష్టానం వారికి టిఆర్ఎస్ పట్ల తమ పార్టీ వైఖరి గురించి తెలియజేస్తే వారు తదనుగుణంగా ముందుకు సాగగలరు.