దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తరువాత భాజపాకు మంచి బలమున్న రాష్ట్రం తెలంగాణా. కనుక వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో 60 ప్లస్ శాసనసభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యమని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో భాజపా విజయానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు. అయన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకొంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ కార్యాలయం చేరుకొని పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని లక్ష్మణ్ చెప్పారు.
వచ్చే ఎన్నికలలో 60 ప్లస్ సీట్లు సాధించాలనుకోవడం గొప్ప ఆలోచనే కానీ భాజపాలో అంతమంది బలమైన అభ్యర్దులున్నారా? ఒకవేళ ఉన్నా వారు తెరాస, కాంగ్రెస్ అభ్యర్ధులతో పోటీ పడి గెలవగలరా?అనే అనుమానాలు కలుగుతాయి. రాష్ట్ర భాజపా నేతలు నేటికీ తమ పార్టీకి తెరాసతో ఎటువంటి రహస్య సంబంధాలు, రహస్య అవగాహన లేదని చెప్పుకోవలసి వస్తోందంటే భాజపా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క అనుమానమే భాజపా విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది. కనుక అమిత్ షా రేపు హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పట్ల తమ పార్టీ వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత ఇస్తేనే రాష్ట్ర భాజపాకు ప్రాణం పోసినట్లువుతుంది. ఈ విషయం గురించి మాట్లాడకుండా ఇంకెన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు.