సిఎం కెసిఆర్ శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పధకానికి ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు శంఖుస్థాపన చేయబోతున్నారు. జిల్లాలోని 15 గ్రామాలలో 33,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపొదించ బడుతున్న ఈ ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వం రూ.553.98 కోట్లు ఖర్చు చేయబోతోంది. దీనికోసం ఆ ప్రాంతంలో 992 ఎకరాలు భూసేకరణ చేయబోతోంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం పాలాపరమైన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది.
అనంతరం గద్వాలలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇటీవల కెసిఆర్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేశారు కనుక ఈ సభలో ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. బహుశః ఆ ఉద్దేశ్యంతోనే నిన్న హటాత్తుగా విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మ మొక్కు చెల్లించుకొని, 2019 ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ఉండవచ్చు. కాంగ్రెస్ నేతలకు భయం పుట్టేలా ఈ బహిరంగసభను నిర్వహిస్తామని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ సభకు కనీసం 1.50 లక్షలమందిని జనసమీకరణ చేస్తున్నామని, గద్వాల చరిత్రలో ఈ సభ చిరస్థాయిగా నిలిచిపోతుందని, వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బహిరంగ సభ గురించి తెరాస నేతలు చెపుతున్న ఈ మాటలు, సభ కోసం చేస్తున్న బారీ ఏర్పాట్లను చూస్తుంటే ఈ సభలోనే సిఎం కెసిఆర్ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరికొన్ని గంటలలోనే దీనిపై ఎలాగూ సిఎం కెసిఆర్ స్వయంగా స్పష్టత ఇవ్వబోతున్నారు కనుక అంతవరకు వేచిచూడాలి.