లోక్ సభ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదుగురు వైకాపా ఎంపిల రాజీనామాలను ఆమోదించారు. ఏపికి ప్రత్యేకహోదా కోరుతూ వైకాపా ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిదున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాదరావు తమ పదవులకు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేశారు. అయితే వాటిని ఇంతవరకు ఆమోదించకుండా స్పీకర్ పక్కనపెట్టేశారు. వచ్చే ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కనుక ఖాళీ అయిన ఆ 5 స్థానాలకు మళ్ళీ ఉపఎన్నికలు వచ్చే అవకాశంలేదని భావించవచ్చు.
వారి రాజీనామాలు ఆమోదింపబడ్డాయి కనుక ఇక నేటి నుంచి వైకాపా వారి త్యాగాలను పొగుడుతూ తెదేపా ఎంపిలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదులుకున్నామని, కానీ అధికార పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే పదవులే ముఖ్యమని వైకాపా వాదించడం ప్రారభించవచ్చు. అది తెదేపా-వైకాపాల మధ్య మరోసరికొత్త రాజకీయ యుద్ధానికి దారి తీయవచ్చు. రాష్ట్ర విభజన తరువాత ఏపి పరిస్థితి దయనీయంగా మారింది. తెదేపా-భాజపా-వైకాపాల రాజకీయాల వలన రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడిందిప్పుడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో ఎవరూ ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.