కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను పునరుద్దరించవలసిందిగా కోరుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాలుగు రోజుల క్రితం స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అయన సానుకూలంగా స్పందించకపోవడంతో వారిరువురూ మళ్ళీ హైకోర్టులో కోర్టుధిక్కారణ పిటిషన్ వేశారు. వారి పిటిషన్ ను ఈరోజు విచారణకు చేపట్టిన న్యాయస్థానం అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 13వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కాంగ్రెస్ ప్రతినిధులు స్పీకర్ ను కలిసినప్పుడే ఆయన సానుకూలంగా స్పందించి ఉండి ఉంటే, ఇరుపక్షాలకు గౌరవంగా ఈ సమస్య నుంచి బయటపడిఉండేవి. కానీ ఆవిధంగా చేయకపోవడంవలన ఇప్పుడు ఈ కేసులో ఇరువర్గాలలో ఎవరో ఒకరు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణా అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మున్మందు ఇంకెంతమంది దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుందో? ఈ కేసును కొనసాగించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించినందున అది ముగిసేవరకు తెరాస సర్కార్ ను కాంగ్రెస్ నేతలు విమర్శించే అవకాశం కూడా కల్పించినట్లయింది.