రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందబోతోందని చాలా ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పుడు ఏపిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత చిరంజీవికి అప్పగించారు. కానీ గెలిపించలేకపోయారు. ఆ తరువాత రఘువీరారెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించారు. కానీ గత నాలుగేళ్ళలో ఏపిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఏపిలో ఆయనొక్కరే కాంగ్రెస్ గురించి మాట్లాడేవ్యక్తిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీని పంపించింది. గురువారం అయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే కనబడనప్పుడు ఊమెన్
చాందీ ఏమి వ్యవహారాలు చూస్తారో తెలియదు. వారిద్దరూ కలిసి తలక్రిందులుగా తపస్సు
చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, కాంగ్రెస్
పార్టీని ఏపి ప్రజలు నాలుగేళ్ళ క్రితమే బ్లాక్ లిస్టులో చేర్చేశారు. వచ్చే
ఎన్నికలలో ఏపిలో వస్తే తెదేపా మళ్ళీ అధికారంలోకి రావచ్చు లేదా వైకాపా రావచ్చు తప్ప
కాంగ్రెస్ పార్టీకి ఛాన్సే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటువంటి దయనీయ పరిస్థితులలో
ఊమెన్ చాందీ బాధ్యతలు స్వీకరించారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నేత రఘువీరా
రెడ్డి సాధించలేనప్పుడు ఇక ఊమెన్ చాందీ ఏమి సాధిస్తారో చూడాలి.