కర్ణాటకలో కమలం వికసించబోతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్లలో లెక్కింపులో భాజపా స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. మొదటి గంటసేపటిలో కాంగ్రెస్, భాజపాలు దాదాపు సరిసమానంగానే ముందుకుసాగాయి. కానీ తరువాత నుంచి భాజపా స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది.
మొత్తం 222 నియోజకవర్గాలలో భాజపా 112, కాంగ్రెస్-68, జెడిఎస్-40, ఇతరులు-02 నియోజకవర్గాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 113 సీట్లు అవసరం కాగా భాజపా ఇప్పటికే 112 స్థానాలలో ఆధిక్యతతో దూసుకుపోతోంది కనుక కర్ణాటకలో కమలం వికసించడం ఖాయంగానే కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయంలో సర్వే సంస్థల అంచనాలు తప్పినట్లే ఉన్నాయి. కానీ భాజపా అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లుగా భాజపా కనీసం 130 స్థానాల వరకు గెలుచుకొని ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
భాజపా మెజార్టీ దిశలో దూసుకుపోతోంది కనుక జెడిఎస్ ‘కింగ్ మేకర్’ కాబోవడంలేదు కనుక ఆ పార్టీ అధినేత కుమారస్వామి చెప్పినట్లుగా హాయిగా ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవచ్చు. ఇక కాంగ్రెస్, భాజపాలకు జెడిఎస్ దూరంగా ఉంటుంది కనుక సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా నిరభ్యంతరంగా చేరవచ్చు.
భాజపా తనంతట తానుగా పూర్తి మెజారిటీతో అధికారలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కనుక సిఎం కెసిఆర్ పై ఎటువంటి నిందపడదు. కనుక ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేరు. కనుక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన చురుకుగా సన్నాహాలు చేసుకోవచ్చు.
కానీ తీవ్రవ్యతిరేక పరిస్థితులలో భాజపా కర్ణాటకలో విజయం సాధించి అధికారం హస్తగతం చేసుకోబోతోంది కనుక అది ఇకపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఏపి, తెలంగాణా రాష్ట్రాలపై దృష్టి సారించవచ్చు. కనుక తెదేపా, తెరాసలు రెండూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరమే.