ఖమ్మం పిసిసి అధ్యక్షుడుగా వ్యవహరించిన ఐతం సత్యం మృతి చెందిన తరువాత దాని కోసం పార్టీలో చాలా మంది నేతలు పోటీలు పడుతుండటంతో ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచేశారు. అయితే జిల్లా పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నవారికి వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వరాదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో, జిల్లాలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఆ పదవి గురించి ప్రయత్నాలు చేయడం మానుకొన్నారు. దీంతో టికెట్ వచ్చే అవకాశం లేనివారికి కొత్త ఉత్సాహం వచ్చి ఆ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీ పడుతున్న వారిలో పువ్వల దుర్గాప్రసాద్, దరిసల భద్రయ్య, కొత్త సీతారాములు, సంబాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వర్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
వారిలో దుర్గాప్రసాద్ కు జిల్లా వ్యాప్తంగా అనేకమంది అనుచరులున్నారు. ఆయనకు టి-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మద్దతు ఉంది. ఇదివరకు జిల్లా గ్రంధాలయాల డిపార్ట్ మెంట్ కు అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు. అయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, జిల్లాలో పార్టీ తరపున జరిగే సభలు, సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తుంటారు. కనుక ఈ పదవి తనకే దక్కవచ్చని భావిస్తున్నారు.
ఇక భద్రయ్యకు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మద్దతు ఉండటం కలిసివచ్చే అంశం. అయనకు కూడా జిల్లావ్యాప్తంగా పార్టీ క్యాడర్ పై మంచి పట్టుంది.
పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు కనుక ఆయన ఆ పదవి ఆశించలేరు కానీ తన సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బిసి వర్గానికి చెందిన కొత్త శ్రీరాములుకు ఖమ్మం జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు కలిగి ఉన్నారు. అయనకు వి. హనుమంతరావు మద్దతు ఉంది. కనుక వీరందరూ జిల్లా పిసిసి అధ్యక్ష పదవికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వారిలో ఎవరికి ఆ పదవి లభిస్తుందో చూడాలి.