కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వ రద్దుకేసుపై ఈరోజు జరుగవలసిన విచారణ వాయిదా పడింది. ఎందుకంటే, ఆ కేసును వాదిస్తున్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి సోమవారం రాత్రి తన పదవికి రాజీనామా చేయడంతో ఇవ్వాళ్ళ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఎవరూ రాలేదు. ఈ కేసులో ప్రకాష్ రెడ్డి వాదనల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ కేసులో వాదించడానికి సుప్రీం కోర్టు న్యాయవాది హరీష్ సాల్వేను రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం.
కేసు విచారణ జరుగుతుండగా మద్యలో ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడంపై భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంచి సమర్ధుడు, నిజాయితీపరుడైన న్యాయవాదిగా పేరొందిన ప్రకాష్ రెడ్డి అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయవలసిరావడం ముఖ్యమంత్రి కెసిఆర్ అహంకారం, దుందుడుకుతనానికి నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. అసలు అయన ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.