భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక ప్రముఖ హిందీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ వలన 2019 ఎన్నికలలో భాజపాకు ఏమనా నష్టం జరుగవచ్చని భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ “దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవన్నీ ఆ ఎన్నికల తరువాత కనబడకుండా మాయం అయిపోతుంటాయి. ఇది కూడా అటువంటిదే. కనుక దాని వలన మాకు వచ్చే నష్టం ఏమీ ఉండదు,” అన్నారు.
‘జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం’ అంటూ కెసిఆర్ చాలా గంభీరమైన పదాలు వాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంటే, రాజకీయాలలో కొమ్ములు తిరిగిన అమిత్ షా దానిని అంత తేలికగా తీసిపడేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల తరువాత ఈ కూటమి కనబడదనే అయన జోస్యం ఫలిస్తుందో లేక దేశంలో కాంగ్రెస్, భాజపా వ్యతిరేక శక్తులను అన్నిటినీ కూడగట్టి కెసిఆర్ మోడీ సర్కార్ ను గద్దె దింపుతారో ఎన్నికల నాటికే తేలిపోవచ్చు. అవకాశవాదులు, అవినీతిపరులు, అసమర్ధులు, అధికారం, పదవీలాలసతో తహతహలాడే ప్రాంతీయ పార్టీల నేతలతో జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధించడం సాధ్యమేనా? అటువంటి నేతలతో ఫెడరల్ ఫ్రంట్ ‘కప్పల తక్కెడ’ గా మారకుండా ఉంటుందా? అనే ప్రశ్నలకు కెసిఆరే సమాధానం చెప్పాలి.