తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ ఒక తిరుగులేని సూపర్ స్టార్. గత రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలలోకి వస్తానని చెపుతునే ఉన్నారు కానీ రాలేదు. జయలలిత ఆకస్మిక మృతి తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని చూసిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలని నిర్ణయించుకొని కొన్ని రోజుల క్రితం అదే విషయం ప్రకటించారు. అయితే ఉరుములేని పిడుగులాగ మద్యలో కమల్ హాసన్ కూడా ప్రవేశించి రాజకీయపార్టీ స్థాపించడంతో, ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. బహుశః అందుకేనేమో పార్టీ ఏర్పాట్లు పక్కనపెట్టి ఆధ్యాత్మిక పర్యటనకు హిమాలయాలకు వెళ్ళి వచ్చారు. అయన హిమాలయాలకు వెళ్ళి వచ్చినా మీడియా సన్యాసం తీసుకోలేదు కనుక అయన నిన్న చెన్నై తిరిగి రాగానే అయన వెంటబడి రాజకీయ పార్టీ గురించి నిలదీసింది. ఈ సందర్భంగా ఒక విలేఖరి “మీ వెనుక భాజపా ఉందన్న మాట వాస్తవమేనా?” అని ప్రశ్నించారు. దానికి రజనీకాంత్ నేరుగా సమాధానం చెప్పకుండా “నా వెనుక ఉన్నదీ దేవుడు ఆ తరువాత ప్రజలు మాత్రమే’ అని సమాధానం ఇచ్చారు.
తమిళుల నూతన సంవత్సరమైన ఏప్రిల్ 14న అయన రాజకీయ పార్టీని స్థాపించవచ్చనే మీడియాలో వస్తున్న ఊహాగానాలను రజనీకాంత్ నిన్న ఖండించారు. అంటే ఇప్పట్లో అయన రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని అర్ధమవుతోంది.