రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం మళ్ళీ వేడెక్కబోతోంది. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు శాసనసభ సభ్యుల కోటాలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒక్కో అభ్యర్ధి ఎంపికకు కనీసం 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలుపుకొని తెరాసకు మొత్తం 90 మంది ఉన్నారు. మజ్లీస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు కూడా తెరాసకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కనుక మూడు రాజ్యసభ స్థానాలు తెరాస దక్కించుకోవచ్చునని స్పష్టం అవుతోంది. అయితే, తెరాసలో చేరిన 27 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు నేటికీ కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. అయినప్పటికీ వారు తెరాస అభ్యర్ధికే మద్దతు పలుతారు కనుక వారిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు మళ్ళీ గట్టిగా వాదించవచ్చు. లేదా వారి అనైతికతను ప్రజలకు చాటి చెప్పేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టవచ్చు. కానీ తెరాసకే మూడు సీట్లు దక్కడం ఖాయం.