పాక్ లో గూడచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణతో ఉరిశిక్ష విధించబడిన మాజీ భారత నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ తనకు క్షమాభిక్ష పెట్టమని పాక్ ఆర్మీ చీఫ్ కు దరఖాస్తు చేసుకొన్నారని పాక్ మిలటరీ ప్రతినిధి నేడు ప్రకటించారు. అతని అభ్యర్ధనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.
అతను క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడం వలన తన నేరాన్ని అంగీకరించినట్లయింది. దీనితో అతను గూడచారి కాదని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ చేస్తున్న వాదనలు అర్ధరహితంగా మారిపోయాయి. అతనే స్వయంగా నేరాంగీకారం చేసినందున ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో కలుగజేసుకోలేదు. అంటే ఈ కేసు ఇప్పుడు పూర్తిగా పాక్ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఇక అతని విషయంలో భారత్ పరోక్షంగా పాక్ పై ఒత్తిడి చేయగలదేమో కానీ ఇదివరకులాగ అతనిని విడిచిపెట్టాలని గట్టిగా నిలదీసి అడగలేదు.
పాక్ జైల్లో ఉన్న అతనిపై పాక్ మిలటరీ అధికారులు ఒత్తిడి తెచ్చి ఈవిధంగా చేసి ఉండవచ్చు. పాక్ వైఖరి తెలిసిన అతను ప్రాణభయంతో క్షమాభిక్ష కోరి ఉండవచ్చు. ఏమైనప్పటికీ అతని అభ్యర్ధనతో ఈ కేసు మొత్తం ఒక్కసారిగా పాకిస్తాన్ కు అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు దీనిపై భారత్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.