ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కేసీఆర్ని విచారించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “ఇదొక కల్పిత కేసు. మా ప్రభుత్వ హయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఎవరూ పిర్యాదు చేయలేదు.
మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను, వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందునే ఈ కేసు పేరుతో మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కానీ కేసీఆర్ని ప్రశ్నించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం చూస్తుంటే మళ్ళీ నాటి ఉద్యమాలు గుర్తొచ్చాయి.
సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకంటే దానిలో భారీగా అవినీతికి పాల్పడ్డారు కనుకనే.
దక్షిణాది కుంభమేళగా భావించబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని ఈ ప్రభుత్వం సమర్ధంగా నిర్వహించలేకపోయింది. అందుకే మేడారంలో మంత్రి కారుపై భక్తులు ఆగ్రహంతో దాడి చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పొరుగు రాష్ట్రం నీళ్ళ దోపిడీకి సహకరిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల మళ్ళీ వివక్ష చూపారు. అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిసిగ్గుగా రాజకీయాలు చేసుకుంటున్నారు,” అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.