రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ మంగళవారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆయన ఈనెల 21న బయలుదేరవలసి ఉండగా 5 రోజులు ముందే బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ కొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యి రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తారు. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరుగబోయే ఒక కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ పాల్గొని తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రసంగించే అవకాశం ఉంది.
ఈమధ్యనే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా తన బృందంతో కలిసి అమెరికాలో పర్యటించి వచ్చారు. అమెరికా అన్ని విధాల అభివృద్ధి చెందిన దేశమే కానీ ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాల కారణంగా ఆ దేశంలో వివిధ సంస్థలు, పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురై ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులలో ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి సమయంలో భారత్ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు పెట్టుబడులు కోసం అమెరికా మీదే ఆశలు పెట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన ఫలితం ఉంటుందో లేదో తెలియదు.