డిశంబర్ 30తో పాత పెద్ద నోట్ల మార్పిడి గడువు ముగిసిపోయింది. అయితే ఇంకా పాత నోట్లు కలిగినవారు వాటికి సరైన లెక్కలు, ఆధారాలు, కారణాలు తెలియజేసి మార్చి 31వరకు రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మార్చుకొనే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయులకు కేంద్రప్రభుత్వం ఆ గడువును జూన్ 30వరకు పెంచింది. ఆలోగా వారు తమ వద్ద ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మార్చుకోవచ్చు. కానీ కేవలం చెన్నై, ముంబై, నాగపూర్, కోల్ కతాలో గల రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మాత్రమే ఈ మార్పిడికి అవకాశం కల్పించింది. దానికి కొన్ని షరతులు కూడా విదించింది. ఒక్కో వ్యక్తి గరిష్టంగా రూ.25,000 వరకు మాత్రమే మార్చుకొనే అవకాశం ఉంది. నవంబర్ 9 నుంచి డిసెంబరు 30 వరకు తాము విదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుంది. గత రెండు నెలలలో పాత నోట్లను మార్చుకోలేదని లిఖితపూర్వకంగా హామీ ఈయవలసి ఉంటుంది. ఇక విదేశీ పర్యటనలకు వెళ్ళినవారు ఎంత మొత్తం అయినా మార్చుకోవచ్చు. కానీ లెక్కలు, ఆధారాల షరతులన్నీ షరా మామూలే. పొరుగునే ఉన్న పాకిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలలో స్థిరపడిన భారతీయులకి మాత్రం ఈ గడువు వర్తించదు. మార్చ్ 31లోగానే మార్చుకోవలసి ఉంటుంది.
ఇంతవరకు కేంద్రప్రభుత్వం కల్పించిన ప్రతీ అవకాశాన్ని నల్లకుభేరులు దుర్వినియోగం చేశారు. కనుక ఇప్పుడు ప్రవాసభారతీయులకి కల్పించిన ఈ అవకాశాన్ని వారు దుర్వినియోగ పరచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.