భారత్ దిగుమతులపై 25 శాతం పన్ను విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి భారత్ చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు మండిపడుతూ భారత్పై అదనంగా జరిమానా కూడా విధించారు. అంతేకాదు... భారత్, రష్యాలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో, “ రష్యాతో భారత్ ఏం చేసుకుంటుందో నాకు అనవసరం. ఆ రెండు దేశాలు తమ ‘చచ్చిన ఆర్ధిక వ్యవస్థలను’ ఇంకా కిందకు తీసుకుపోతున్నాయని మాత్రం నేను చెప్పగలను. భారత్తో అమెరికా వాణిజ్యం అంతంత మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక శాతం పన్నులు విధిస్తోంది కనుక.
అదే విదంగా రష్యా, అమెరికాల మద్య కూడా ఎటువంటి వాణిజ్యం జరుగట్లేదు. అన్ని విధాల విఫలమైన రష్యా మాజీ అధ్యక్షుడు మెడ్వెడేవ్, నేటికీ తానే రష్యా అధ్యక్షుడునని భ్రమలో ఉన్నారు. అయన అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది. ఆయన చాలా ప్రమాదకరమైన చోట అడుగుపెడుతున్నారని గుర్తిస్తే మంచిది,” అని ట్రంప్ హెచ్చరించారు.