అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయ విద్యార్ధులు తరచు దాడులు, దోపీడీకి గురవుతూనే ఉంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) అమెరికాలో హత్య చేయబడ్డాడు.
అతను అమెరికాలో మిల్వాంకివి స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటూ స్థానిక యూనివర్సిటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడి ఖర్చుల కోసం బయట ఓ స్టోర్లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు.
రెండు రోజుల క్రితం డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ని వెంటనే సమీపంలో హాస్పిటల్కు తీసుకువెళ్ళి చికిత్స అందించినప్పటికీ వైద్యులు అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.
అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించుకొని తమకి కొండంత అండగా నిలబడతాడనుకుంటే, ఇంత చిన్న వయసులోనే దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోయాడని అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తమ కొడుకు మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయపడాలని వారు వేడుకుంటున్నారు.