ఖమ్మంలోని మామిళ్ళగూడెంకు చెందిన వరుణ్ రాజ్ (29) అమెరికాలో కత్తిపోట్లకు గురై అక్కడ ఆస్ప్తృలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరుణ్ ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఖాళీ సమయంలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
అక్టోబర్ 31వ తేదీన వరుణ్ స్థానిక జిమ్ సెంటర్ నుంచి హాస్టల్కు తిరిగి వెళుతుండగా, ఓ దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆ దాడిలో వరుణ్ రాజ్ తలకు తీవ్ర గాయమైంది.
పోలీసులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా, వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి వరుణ్ రాజ్కు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
అమెరికా పోలీసులు వరుణ్ తల్లితండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇన్ని రోజులు కొడుకు తప్పకుండా బ్రతుకుతాడని, త్వరలోనే కోలుకొని తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న వరుణ్ తల్లితండ్రులు కొడుకు ఇక లేడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వరుణ్ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.