జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు అభినందనలు తెలిపేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్లో మాట్లాడారు. మళ్ళీ వారిరువురూ ఈ నెలలో జరుగబోయే క్వాడ్ సమావేశంలో వర్చువల్ విధానంలో మాట్లాడుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచదేశాలపై ఏదో రూపంలో పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్న చైనాను కట్టడి చేయడం కోసం భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి క్వాడ్ దేశాల కూటమిని ఏర్పాటుచేసుకొన్నాయి. ఈ నెలలో జరుగబోయే క్వాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో వర్చువల్ విదానంలో మాట్లాడబోతున్నారు. కనుక ఇది మోడీ-బైడెన్ల తొలి ప్రత్యక్ష సమావేశంగా భావించవచ్చు. చైనాను కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా చైనాలోని అమెరికా సంస్థలను, అమెరికా పెట్టుబడులను భారత్ వంటి మిత్రదేశాలకు తరలించాలని అమెరికా చాలా కాలంగా ఆలోచిస్తోంది. కనుక మోడీ-బైడెన్ ప్రత్యక్ష సమావేశంలో భారత్కు లబ్ది కలిగే ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. వైట్హౌస్ ఈ సమావేశాన్ని ఇంకా ఖరారు చేయవలసి ఉంది.