అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ఖాతాను శాశ్వితంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కొన్ని రోజులుగా ట్విట్టర్లో ఆయన పెడుతున్న సందేశాలను నిశితంగా గమనించిన తరువాత వాటితో ఆయన హింసకు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించామని, అందుకే ఆయన ట్విట్టర్ ఖాతాపై శాశ్విత నిషేధం విధిస్తున్నట్లు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది.
ఇటీవల వాషింగ్టన్లో క్యాపిటల్ హిల్లో అమెరికన్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా, ట్రంప్ మద్దతుదారులు భవనంలోకి జొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో నలుగురు పౌరులు మరణించగా పలువురు గాయపడ్డారు. ట్రంప్ ప్రోద్బలంతోనే ఈ విధ్వంసం జరిగినందుకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రాం తదితర సోషల్ మీడియా సంస్థలు ఆయన ఖాతాను తాత్కాలికంగా నిషేధించాయి. వాటిలో ఫేస్బుక్ ఈనెల 20వరకు నిషేధం పొడిగించగా ట్విట్టర్ ఏకంగా శాశ్వితంగా నిషేధించింది.
ప్రపంచంలోనే సర్వశక్తివంతుడైన ఒక దేశాధ్యక్షుడికి ఇంతకంటే ఘోర అవమానం ఏముంటుంది? అయితే ఇదంతా స్వయంకృతాపరాధమే కనుక అందుకు ఆయన మూల్యం చెల్లించవలసిందే.