ప్రపంచంలోకెల్లా అత్యధిక రద్దీగా ఉండే నగరాలలో న్యూయార్క్ ఒకటి. న్యూయార్క్లో ‘టైమ్స్ స్క్వేర్’కు రోజుకు లక్షలమంది వస్తుంటారు. కనుక అనేక వ్యాపార సంస్థలు అక్కడ ఉండే బిల్ బోర్డ్స్ (భారీ డిజిటల్ స్క్రీన్స్)పై తమ వ్యాపార ప్రకటనలు ఇస్తుంటాయి. ప్రభుత్వ సంస్థలు, రాజకీయ నాయకులు కూడా వాటిని వినియోగించుకొంటుంటారు. ఆగస్ట్ 5వ తేదీన అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబందించి ఓ భారీ చిత్రాన్ని, పక్కనే భారత్ను సూచిస్తున్నట్లుగా త్రివర్ణ పతాకాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఓ బిల్బోర్డ్ పై ఆరోజు ప్రదర్శించడం విశేషం.
టైమ్స్ స్క్వేర్లోని బిల్బోర్డ్ పై ప్రకటనలు ప్రదర్శించడానికి చాలా భారీగా ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. కనుక అంత డబ్బు ఖర్చు చేసి అయోధ్యలో రామమందిరాన్ని బిల్బోర్డ్ పై ఎవరు..ఎందుకు ప్రదర్శిస్తారు? అని ఆలోచిస్తే, అధికార రిపబ్లికన్ పార్టీయే ఆ ఖర్చును భరించి ఉండవచ్చని అర్ధమవుతుంది. నవంబర్ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో స్థిరపడిన భారతీయులను ఏదోవిధంగా ఆకర్షించి వారి ఓట్లు పొందేందుకు తిప్పలు పడుతున్నారు. కనుక అధికార రిపబ్లికన్ పార్టీయే ఈ చిత్రా ప్రదర్శన ఏర్పాటు చేసి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.