మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత నిన్న సిఎం రేవంత్ రెడ్డిపై చాలా ఘాటు విమర్శలు చేశారు. ఆమె తల్లితండ్రులకు తెలియకుండా, వారికి చెప్పకుండా ఈవిధంగా మాట్లాడారంటే నమ్మశక్యంగా లేదు. అందుకే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది.
ఆమె మాటల్లో తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అసంతృప్తి కంటే, ఆమె మాట్లాడిన మాటలు, ప్రస్తావించిన అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ భాషలాగే ఉన్నాయి. కొండా సుస్మిత వీడియోని బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో పెట్టుకుంది కూడా.
కనుక కొండా సురేఖ కుటుంబం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా?అనే సందేహం కలుగుతోంది.
పరకాల సీటు కోసమో లేదా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి కోసమో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్లయితే వారి కుటుంబమే రాజకీయంగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. మరో రెండున్నరేళ్ళు పదవిలో ఉండవచ్చు. కానీ పరకాల సీటు ఆశిస్తున్న కొండా సుస్మిత, ఆ సీటుని మళ్ళీ రేవూరికే కట్టబెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లు గ్రహించగానే ఈవిధంగా బరస్ట్ అవడం సహజమే కావచ్చు.
కానీ తల్లి మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కదా? అప్పుడు కొండా కుటుంబంలో అందరూ రాజకీయ నిరుద్యోగులుగా మారుతారు కదా?
కనుక ఒకవేళ కొండా సుస్మిత బీఆర్ఎస్ పార్టీ ప్రభావంతో ఈవిధంగా మాట్లాడినట్లయితే, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎన్నికల వరకు సంయమనం పాటించడం చాలా అవసరం.
గతంలో కొండా దంపతులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు తిరిగివచ్చారో గుర్తు చేసుకొంటే మళ్ళీ అలాంటి ఆలోచన చేయరు. ఇలా మాట్లాడరు.